ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి బాబులు శృతి తప్పుతున్నారు. డ్రగ్స్ మత్తు కోసం బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హనుమంతు అనే యువకుడు గంజాయి కోసం నానా రభస చేశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మీ కాళ్లు పట్టుకుంటా.. నాకు గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్ అంటూ సెల్టవర్ ఎక్కాడు.
ఉడుతల హనుమంతు అనే యువకుడు మద్యం మత్తులో 150 అడుగుల బీఎస్ఎన్ఎల్ సెల్టవర్ ఎక్కాడు. దానిపై అనేక విన్యాసాలు చేస్తూ, దూకేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఎస్సై దేవకుమార్ చాకచక్యంగా వ్యవహరించి, అతన్ని సెల్ టవర్పై నుంచి కిందకు దింపి అదుపులోకి తీసుకున్నాడు.
అయితే సెల్టవర్ ఎందుకు ఎక్కావని ఎస్సై ప్రశ్నించగా.. నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్.. నీ కాళ్లు పట్టుకుంటా అంటూ బతిమిలాడాడు. కాగా, పోలీసులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
